అన్నవరం: ఈ నెల 26న ప్రారంభం కానున్న రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి శ్రీరామ నవమి వేడుకలకు, వచ్చే నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు శనివారం రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయం వద్ద పండితులు విఘ్నేశ్వర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి, మంత్రోచ్చారణల నడుమ ఉదయం 10.25 గంటలకు పందిరి రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమంలో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు చైర్మన్, ఈఓల కన్నా ముందుగానే పందిరి రాటను ముట్టుకునేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈఓ దంపతుల మధ్య నుంచే ఒక మహిళ చేయిపెట్టి పందిరి రాటను పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే ప్రకటించినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదంటూ సిబ్బందిపై ఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు 150 మంది వరకూ దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. కానీ, ఈ కార్యక్రమం వద్ద కనీసం నలుగురు సెక్యూరిటీ గార్డులు కూడా లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో అత్యంత వైభవంగా జరిగే వైదిక కార్యక్రమాలతో పోలిస్తే అన్నవరంలో కార్యక్రమాలు తూతూమంత్రంగానే నిర్వహిస్తున్నారు. అలా నిర్వహించే కార్యక్రమాల్లో కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడం మరింత విమర్శలకు తావిస్తోంది.


