పిఠాపురం రూరల్: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి.తిమ్మాపురంలో స్థానిక టీడీపీ నాయకుని ఇంటి వద్ద బుధవారం చేపట్టిన గ్యాస్ పంపిణీపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలోనూ రాజకీయమేనా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ పి.తిమ్మాపురంలో హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు సరఫరా చేసే సిలిండర్లను టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బర్ల అప్పారావు ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా గ్యాస్ బుక్ చేసుకుంటే ఇంటి వద్ద సిలిండర్ అందజేస్తారు. అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే బహిరంగ (పబ్లిక్) ప్రదేశాల్లో గ్యాస్ పంపిణీ జరగాల్సి ఉంటుంది. అలాకాకుండా గ్రామంలో ఒక టీడీపీ నాయకుడి ఇంటి వద్ద సరఫరా నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుని ఇంటి వద్ద ఖాళీ స్థలం లేకపోయినా అతని పబ్లిసిటీ కోసం ఇంటి ఎదుట నడిరోడ్డుపై నిలిపి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. దీంతో జనం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ పంపిణీ రాజకీయ నేతల ఇళ్ల వద్ద నిర్వహించడం సరైంది కాదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, సరఫరా నిర్వాహకులు, అధికారులు భవిష్యత్తులోనైనా సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసి పంపిణీ చేపట్టాలని కోరుతున్నారు.


