బోట్క్లబ్ (కాకినాడ సిటీ): హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యాన కలెక్టరేట్లో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ను మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ఆనంది శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఒక ప్యానల్ అడ్వొకేట్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కేసులను ఇరు వర్గాల పరస్పర ఒప్పందంతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లీగల్ ఎయిడ్ క్లినిక్ కలెక్టరేట్లో పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.తిప్పేనాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్.రామ్మోహన్రావు, ప్యానల్ అడ్వొకేట్ ఎ.సునీల్కాంత్ కుమార్ పాల్గొన్నారు.


