కేంద్ర బడ్జెట్లో వ్యవసాయంపై చిన్నచూపు
కర్నాకుల వీరాంజనేయులు
గోకవరం: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగంపై చిన్నచూపు చూశారని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ బడ్జెట్ వలన కార్పొరేట్లకు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్నారు. భారీ డేటా సెంటర్లకు 2047 వరకూ రాయితీలివ్వడం వలన అదానీ, గూగుల్ వంటి సంస్థలకు ఉపయోగం తప్ప సామాన్యులకు ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. రవాణా, పారిశ్రామిక రంగాలకు మూలమైన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం చేయాలన్న రైతుల డిమాండ్లను ఎక్కడా పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ రంగంపై 45 శాతం మంది శ్రామికులు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ఏం చేస్తారో చెప్పలేదని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల నుంచే దేశానికి ఎక్కువ శాతం ఆదాయం వస్తుందని, కానీ, ఒక్క శాతం సంపద ఉన్న సంపన్నులకు అనుకూలంగానే బడ్జెట్ కేటాయింపులున్నాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగ కల్పనపై స్పష్టత లేదన్నారు. మొత్తం దేశాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేటాయింపులున్నాయి తప్ప ప్రజలకు ఆశాజనకంగా ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, విశాఖ ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్ట్ల ఊసే లేదని అన్నారు. బడ్జెట్లో రాష్ట్రాలకు, వ్యవసాయం, చిన్న పరిశ్రమల బలోపేతానికి కేటాయింపులు లేవని విమర్శించారు. స్పష్టత లేని, సామాన్యులకు ఉపయోగపడని ఈ బడ్జెట్పై ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నించాలని, పోరాడాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.


