ఆగకొండ తవ్వేసి..
● కొండను తవ్వి మట్టి తరలింపు
● అధికార అండతో బరితెగింపు
● రేయింబవళ్లు యథేచ్ఛగా పనులు
● చోద్యం చూస్తున్న అధికారులు
అక్రమ తవ్వకాలు అరికట్టాలి
యర్రవరంలోని అక్రమ తవ్వకాలు అరికట్టాలి. పురావస్తు శాఖకు చెందిన కొండను తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని తప్పించుకుంటున్నారు. మండలంలో అక్రమంగా మట్టి, ఇసుకను తరలించడం షరామామూలుగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
–దాడిశెట్టి వీరబాబు, జైభైమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఏలేశ్వరం: ఆగ‘కొండ’ తవ్వేస్తున్నారు.. అధికారం చేతిలో ఉండడంతో ఆపేవారే లేకపోయారు.. వారి అక్రమాలకు కొండలనే కరిగించేస్తున్నారు.. నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు తవ్వుకుపోతున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించేలా, ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు. ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలోని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న కొండను కొందరు అక్రమంగా కొల్లకొడుతున్నారు. ఈ గ్రామంలో కొండను ఆనుకుని ఓ రైతు పొలం ఉంది. పొలం కలుపుకొని సర్వే నంబర్ 366లో 42 ఎకరాల కొండ ఉంది. సమీపంలో ఉన్న రైతు కన్ను ఆ కొండపై పడింది. దీంతో స్థానిక అధికార పార్టీ నాయకులను సంప్రదించగా, వారి అండదండలతో ఐదు పొక్లెయినర్లు, సుమారు 50 ట్రాక్టర్లతో కొండను గుల్ల చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ పని రాత్రి పగలు అనే తేడా లేకుండా జరిగిపోతోంది. అయినా అధికారులు ఇటుగా రావడం లేదు.
కొల్లగొట్టి.. కలిపేసుకుని
జాతీయ రహదారిని ఆనుకుని పొలం కావడంతో ఎకరం సుమారు రూ.కోటి పలుకుతుంది. పొలం జాతీయ రహదారికి దిగువన ఉంది. దీంతో కొండ కొల్లగొట్టి చదును చేసి పొలంలో కలుపుకోవడంతో పాటు తవ్వుతున్న మట్టితో పొలాన్ని చదును చేస్తున్నారు. ఇలా ఎకరం రూ.కోటి పైనే పలికే అవకాశం ఉండడంతో పాటు మట్టితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా సదరు రైతు అధికార నాయకులకు భారీగానే రూ.లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నా..
యర్రవరం గ్రామంలో కొండపై బుద్ధుని అవశేషాలు ఉన్నాయనే ఉద్దేశంతో గతంలో దీనిని పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా రైతు పొలంతో పాటు కొండను రెవెన్యూ, పంచాయతీ, పురావస్తు శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేయించారు. తరువాత కొన్ని నెలలకు రికార్డులను మార్పు చేసి, కొండ జారి తమ పొలం ఆక్రమించుకుందని రైతు కొండను తవ్వడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు అధికారులు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాలును వివరణ కోరగా తవ్వకాలపై విచారణ జరుపుతున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే తగినచర్యలు తీసుకుంటామని తెలిపారు.
పొలంలో గుట్టలుగా వేసిన మట్టి
మట్టిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లు
ఆగకొండ తవ్వేసి..
ఆగకొండ తవ్వేసి..
ఆగకొండ తవ్వేసి..


