అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
పాయకరావుపేట: పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం 5, 6, 7, 8, 9, 10వ తరగతులు పూర్తి చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జరిగిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయాలని, అప్పుడే వారు వృద్ధిలోకి వస్తారని అన్నారు. జేఈఈ (మెయిన్స్), జేఈఈ (ఆడ్వాన్స్డ్), నీట్లలో తరచూ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం పిల్లలు పుస్తకాల కన్నా మొబైల్తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి వివరించారు. తిరుమల విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రష్మీ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే రోల్మెడల్గా ఉండాలని, ప్రతి తల్లి తమ పిల్లలను సరైన మార్గంలో పెంచాలన్నారు. పిల్లల చదువుతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే దిశగా తమ విద్యా సంస్థ ఆలోచించి హాస్టల్ విద్యార్థులకు రోజూ ఉదయాన్నే యోగా తరగతులు, సాయంత్రం ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నామని అన్నారు. ఐఐటీ ధన్బాద్లో చదువుతున్న తిరుమల పూర్వ విద్యార్థి తండ్రి చిన్ని మాష్టార్ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలను చదివిస్తున్నారన్నారు. ఈ సదస్సులో పాయకరావుపేట కాలేజ్ ప్రిన్సిపాల్ కె.విజయ్కుమార్, స్కూల్ ఇన్చార్జ్ ఎం.సునీత తదితరులు పాల్గొన్నారు.


