జీఎస్టీ పెంపుపై పొగాకు రైతుల నిరసన
● దేవరపల్లిలో భారీ ర్యాలీ
● మూడు రోడ్ల జంక్షన్లో మానవహారం
పొగాకుపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని
దేవరపల్లిలో భారీ ర్యాలీ చేస్తున్న పొగాకు రైతులు
మార్కెట్లో దొరుకుతున్న
అక్రమ విదేశీ సిగరెట్లను చూపిస్తున్న రైతులు
దేవరపల్లి: సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన భారీ జీఎస్టీ పెంపును నిరసిస్తూ మంగళవారం దేవరపల్లిలో పొగాకు రైతులు ధర్నా చేశారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా దేవరపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి, మూడు రోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. టుబాకో బోర్డు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన జరిపి, బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. పెంచిన ఎకై ్సజ్ డ్యూటీ, జీఎస్టీ తగ్గించాలని, రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని, అక్రమ సిగరెట్లను అరికట్టాలని, పొగాకు పంటను కాపాడాలని నినాదాలు చేశారు.
రైతుల జీవనానికి ముప్పు
రైతు సంఘం నాయకులు కరుటూరి శ్రీనివాస్, కాట్రు సత్యనారాయణ, గద్దే శేషగిరి, పిన్నమనేని మధుమోహన్, యాగంటి సాయిబాబు, ఈలపోలు చిన్ని, పలువురు రైతులు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పొగాకు రైతుల జీవనానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో సిగరెట్లపై 22 శాతం పన్ను పెంచినప్పుడు పరిశ్రమ కొనుగోళ్లు తగ్గి పొగాకు ధరలు దాదాపు 25 శాతం పడిపోయాయన్నారు. అప్పట్లో కిలోకు రూ.23 వరకూ రైతులు నష్టపోయారని, ప్రస్తుతం ప్రకటించిన పన్ను పెంపు 50 నుంచి 60 శాతం వరకు ఉంటుందని నాయకులు తెలిపారు. ఇటువంటి పెరుగుదల భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. దీని వల్ల అక్రమ సిగరెట్లు మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులోని వస్తాయన్నారు. పెంచిన జీఎస్టీ వల్ల ప్రస్తుతం రూ.17 ఉన్న సిగరెట్ ధర రూ.25 అవుతుందన్నారు. వెయ్యి సిగరెట్లపై రూ.2 వేల నుంచి రూ.4,500 వరకూ ఉన్న పన్ను.. ఇప్పుడు రూ.8 వేలకు పెరుగుతుందన్నారు.
అక్రమ సిగరెట్లకు ఊతం
భారీ పన్నుల వల్ల అక్రమ సిగరెట్ వ్యాపారం పెరుగుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో దాదాపు 26 శాతం సిగరెట్లు అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.23 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని వివరించారు. కాగా.. మూడు వేలం కేంద్రాల నుంచి వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధం
ఫేమ్ వర్క్ కన్వర్షన్ ఆఫ్ టుబాకో క్రాప్ (ఎఫ్సీటీసీ) నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను దెబ్బతీస్తున్నాయి. జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల దేశీయ సిగరెట్ల వినియోగం తగ్గి, నాన్ టాక్స్బుల్ (అక్రమ) సిగరెట్ల వినియోగం పెరుగుతుంది. పొగాకు ఉత్పత్తులు, సాగు చేస్తున్న రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొగాకు పంటకు సమాన ఆర్థిక శక్తి గల ప్రత్యామ్నాయ పంటలు, దీర్ఘకాలిక అవసరాలు తీర్చే పంటలను ప్రభుత్వాలు పొగాకు రైతులకు చూపించాలి. లక్షల మంది కార్మికులు, వేల మంది రైతులు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఈ జీఎస్టీని సరళం చేసి పొగాకు పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్లాలి.
– వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
జీఎస్టీ పెంపుపై పొగాకు రైతుల నిరసన
జీఎస్టీ పెంపుపై పొగాకు రైతుల నిరసన


