విరి విలాపం
పెరవలి: మార్కెట్లో పూల ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మూఢం ముందే రావడంతో శుభ ముహూర్తాలు లేక వినియోగం తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీని వల్ల రైతులకు నష్టం వస్తుంటే పూలతోటలపై ఆధారపడిన కూలీలకు పనులు లేక ఉపాధి కరువై విలవిలలాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు తలమానికంగా ఉన్న కడియం, కాకరపర్రు పూల మార్కెట్లు నేడు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు విక్రయాలు లేక.. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక.. కూలీలకు ఉపాధి దొరకక.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండుగలు లేకపోవటం వలన పూల వినియోగం తక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం చామంతి కిలో రూ.300, కాగడాలు కిలో రూ.900, కనకాంబరాలు రూ.1200 పలికితే నేడు పూల రకాలు, నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.150కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులు మార్కెట్కు పట్టుకువచ్చిన పూలు రెండు మూడు రోజుల వరకు విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారుల దగ్గరే రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉండిపోతున్నాయి. నాలుగు రోజులు దాటితో పూలు వసి వాడిపోయి రోడ్డు పక్కన పాడేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పూల దిగుబడి చాలా బాగుందని, మార్కెట్లో పూల ధరలు లేకపోవటం వల్ల వారానికి రెండు కోతలు కోయాల్సిన పూలు నేడు ఒక్కకోతే కోస్తున్నామని రైతులు చెప్తున్నారు. తీరా కోసిన తరువాత కనీసం కూలీల ఖర్చులు కూడ రావడం లేదని, దీంతో కోయకుండానే నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. పూల రైతులు గ్రామాల బాట బట్టి కిలో పూలు సమయాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మార్కెట్లకు పూలను తీసుకువెళ్తుంటే వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని.. దీంతో మళ్లీ తామే తమ గ్రామాలకు తీసుకువెళ్లి వచ్చినకాడికి విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పూలసాగు ఇలా..
జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు చేస్తుంటే దీనిపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పూలకు మార్కెట్లో ధరలు పలకకపోవడం వల్ల సగానికి సగం మందికి ఉపాధి కరువైయ్యిందని రైతులు అంటున్నారు. చిరు వ్యాపారులు సైతం కూలి ఖర్చులు రావడం లేదంటున్నారు.
పనులు లేక ఇబ్బంది
పూల కోతలు, పూల తోటలకు ఎరువులు, పురుగు మందులు కొట్టే కూలీలకు, దండలు కట్టే కూలీలకు, చిరు వ్యాపారాలు చేసే సైకిల్ వ్యాపారులకు పని అంతంతమాత్రంగా లభించడంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం పూలు కోసే కూలీలకు వారానికి ఒక్కరోజు మాత్రమే పనులు లభిస్తుంటే, పూల దండలు కట్టే మహిళలు పనులు లేక అల్లాడిపోతున్నారు.
మార్కెట్లో ధరలు ఇలా..
పూల మార్కెట్లో 20 రోజుల వ్యవధిలో ధరలు పరిశీలిస్తే సగానికి సగం పడిపోయాయి.
పూల రకం 20 రోజుల ప్రస్తుత
క్రితం (రూ.) ధర (రూ.)
బంతి పూలు 80 20
చామంతి 300 30-50
గులాబీలు 250 140
లిల్లీ పూలు 300 80
కాగడాలు 900 400
కనకాంబరాలు 1200 600
తోటలోనే మగ్గిపోతున్న పూలు
పూలధరలు తగ్గడంతో వాటిని కోయకుండా రైతుల చేలల్లోనే వదలేస్తున్నారు. ఎందుకంటే కోయిస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదని, దీనితో పూల కోసేకంటే వదిలేయడమే మేలని చెప్తున్నారు. నిత్యం పదిమందితో పూలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బంతి పూలు ఒక్కకోతకు 10 కూలీలు అవసరం వస్తే వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూలు రూ.20 పలుకుతున్నాయి. ఒక్క కోతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. దీనితో పూలకు మార్కెట్లో వంద కిలోలకు రూ.రెండు వేలు వస్తే ఖర్చు రూ.4500 అవుతోందని రైతులు చెప్తున్నారు. అందుకే పూలను కోయకుండా వదలివేస్తున్నామని వాపోతున్నారు. అన్ని రకాల పూల సాగు పరిస్థితీ ఇలానే ఉందని రైతులు అంటున్నారు.
విరివిగా పూసినా సిరులు అంతంతే
ధరలు లేక మందగించిన వ్యాపారాలు
గగ్గోలు పెడుతున్న రైతులు
పనులు లేక కూలీలు..
ఉపాధి దొరక్క పనివారు విలవిల
‘తూర్పు’న 4897 ఎకరాల్లో పూల సాగు
ప్రత్యక్షంగా,‘ పరోక్షంగా
15వేల మందిపై ప్రభావం


