మా ఊరిని మార్చింది జగనే.. | - | Sakshi
Sakshi News home page

మా ఊరిని మార్చింది జగనే..

Dec 21 2025 9:29 AM | Updated on Dec 21 2025 9:29 AM

మా ఊర

మా ఊరిని మార్చింది జగనే..

ఒకప్పుడు మా ఊరు అభివృద్ధికి ఆమడ దూరం. ఏ చిన్న పనికై నా పిఠాపురం వెళ్లాల్సిందే. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ అవస్థలు పడేవారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), ఆసుపత్రి, అంగన్‌వాడీ కేంద్రం, పాల కేంద్రం, తాగునీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకు, డ్రైనేజీలు, పాఠశాలలకు నూతన భవనాలు.. ఇలా సుమారు రూ.5 కోట్ల వరకూ మా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి. విత్తు నాటిన నాటి నుంచి పంట డబ్బు చేతికి వచ్చే వరకూ అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. ఆర్‌బీకేల ద్వారా రైతులకు అన్ని సేవలూ అందుబాటులోకి వచ్చాయి. పింఛన్లు ఇంటింటికీ అందించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో సర్పంచ్‌గా పని చేయడం పూర్వ జన్మ సుకృతం. ఒక మనిషి తలరాత దేవుడు రాస్తాడనేది ఎంత నిజమో.. గ్రామాల తలరాతను మార్చింది వైఎస్‌ జగన్‌ అనేది అంతే నిజం.

– బండి వెంకట సుబ్బారావు (సుబ్బులు),

సర్పంచ్‌, మాధవపురం, పిఠాపురం మండలం

పిఠాపురం మండలం మాధవపురంలో

జగన్‌ హయాంలో నిర్మించిన ఆస్పత్రి

నాడు–నేడు పనులతో అభివృద్ధి చేసిన పాఠశాల

సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్‌ జగన్‌ గత వైఎస్సార్‌ సీపీ పాలనలో రూ.వేల కోట్లతో సంక్షేమంమేనిఫెస్టోలో ప్రకటించని పథకాలు సైతం అమలుజననేత మళ్లీ రావాలని సర్వత్రా ఆకాంక్ష

నేడు వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్‌ల కటింగ్‌తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు.

విద్యారంగం.. స్వర్ణయుగం

ఫ జగన్‌ పాలనంతా విద్యారంగానికి స్వర్ణయుగంగానే నిలిచింది.

ఫ జిల్లాలో 933 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 247 ఉన్నత కలిపి 1,285 పాఠశాలలున్నాయి. నాడు – నేడు మొదటి విడతలో 441 పాఠశాలల అభివృద్ధికి రూ.132 కోట్లు, రెండో విడతలో 881 పాఠశాలలకు రూ.334 కోట్లు మంజూరు చేశారు.

ఫ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కార్పొరేట్‌తో పోటీ పడేలా దృశ్య, శ్రవణ విద్యను జగన్‌ అందుబాటులోకి తెచ్చారు. 2022 డిసెంబర్‌ 21న తన పుట్టిన రోజును పురస్కరించుకుని 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ట్యాబుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మొత్తం 380 పాఠశాలల్లో రూ.126 కోట్లతో 41,230 మంది విద్యార్థులకు వీటిని సమకూర్చారు. దివ్యాంగ విద్యార్థులకు సైతం 250 ట్యాబులు అందజేశారు.

ఫ 247 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) సమకూర్చడం ద్వారా డిజిటల్‌ విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. అలాగే, 933 ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం స్మార్ట్‌ టీవీలు అందజేశారు.

ఫ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థుల చేతికి జగనన్న విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి రూ.2,419 విలువైన మూడు జతల యూనిఫాం, పాఠ్య, నోట్‌ పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్‌ బ్యాగ్‌, బెల్టు, బ్యాగ్‌, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, 1–5 తరగతి విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీలతో కూడిన కిట్‌ అందించేవారు. ఈవిధంగా 1,59,797 మంది విద్యార్థులకు ఏటా రూ.30 కోట్లు వెచ్చించారు. నాడు ఇచ్చిన స్కూల్‌ బ్యాగులనే ఇప్పటికీ విద్యార్థులు వినియోగిస్తున్నారంటే వాటి నాణ్యత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న విద్యాకానుకను చంద్రబాబు సర్కార్‌ గద్దెనెక్కాక అందజేసిన బ్యాగ్‌లు ఆరు నెలలు కూడా తిరగకుండానే చిరిగిపోయి మూలకు చేరాయి.

ఫ అమ్మ ఒడి పథకం ద్వారా అర్హులైన 1.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.1,140 కోట్ల మేర జమ చేసేవారు. ఫలితంగా అప్పటి వరకూ పనుల్లోకి వెళ్లే విద్యార్థులను వారి తల్లిదండ్రులు బడులకు పంపించడం, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు, హాజరు శాతం పెరగడాన్ని అప్పట్లో విద్యాశాఖాధికారులు గుర్తించారు.

గాలికొదిలేసిన నేటి సర్కారు

విద్యారంగంలో వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలను నేడు చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. అమ్మ ఒడి పేరును తల్లికి వందనమంటూ మార్చి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ పథకం కింద ప్రతి ఇంట్లో పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్న చంద్రబాబు, పవన్‌ మాటలు వట్టి గారడీగా మిగిలాయి. పైగా అనేక సాకులతో విద్యార్థుల సంఖ్యలో గణనీయంగా కోత పెట్టేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులు నానా ఇబ్బందులూ పడుతున్నారు.

అన్నదాతకు పెద్దపీట

దేశానికి తిండి పెట్టే అన్నదాతలకు నాటి సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారు. దేశంలోనే తొలిసారిగా వినూత్న రీతిలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా రైతులపై ప్రీమియం భారం లేకుండా చేయూతనందించారు. దీనిని కౌలు రైతులకు, దేవదాయ భూములు కౌలుకు చేసే రైతులకు కూడా వర్తింపజేశారు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన ఐదేళ్లలో ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన 1,35,353 రైతులు రూ.29,638.79 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందుకున్నారు. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు, రైతులందరికీ ఈ–క్రాప్‌ నమోదు తప్పని సరి చేయడంతో ఇది సాధ్యమైంది.

సొంతింటి కల సాకారం

పేదల సొంతింటి కలను జగన్‌ సాకారం చేశారు. రూ.1,531.40 కోట్లతో 3,600.99 ఎకరాలు సేకరించి 319 జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1,52,316 మందికి ఇంటి స్థలాలు అందించారు. తొలి విడత ఇళ్ల నిర్మాణానికి గాను 71 వేల మందికి నిధులు కూడా మంజూరు చేశారు.

కాకినాడలో ఐఐఎఫ్‌టీ

జాతీయ స్థాయిలో ఢిల్లీ, కోల్‌కతా తరువాత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) మూడో క్యాంపస్‌ కాకినాడకు దక్కడం జగన్‌ సర్కార్‌ కృషి ఫలితమే. దీని కోసం గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా తదితర రాష్ట్రాల మధ్య గట్టి పోటీ నెలకొన్న తరుణంలో కాకినాడలో ఏర్పాటు చేసేలా నాటి ముఖ్యమంత్రి జగన్‌ అవిరళ కృషి చేశారు. దీని కోసం కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో జగన్‌ 25 ఎకరాలు కేటాయించారు. ఆయన హయాంలోనే కేంద్రం నుంచి సాధించిన రూ.229 కోట్లతో ఈ క్యాంపస్‌లో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.

బాగుబడి

మండల కేంద్రమైన గోకవరం గ్రామానికి చెందిన షేక్‌ నాగూర్‌ వలీబాబా, షేక్‌ యాకూబీబీ దంపతులది మధ్యతరగతి కుటుంబం. వలీబాబా కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారి ఒక్కగానొక కుమారుడు షేక్‌ బషీర్‌ను ఉన్నత చదువులు చదివించాలని దంపతులిద్దరూ ఆశ పడేవారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందో లేదోననే భయంతో ఐదో తరగతి వరకూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఫీజులు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత, ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి మెరుగైన విద్యను అందించారు. ఆయనపై నమ్మకంతో వలీబాబా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 6 నుంచి 8వ తరగతి వరకూ స్థానిక ఎంపీయూపీ, 9, 10 తరగతులు జెడ్పీ హైస్కూల్‌లో చదివించారు. ఆ పాఠశాలలను నాడు–నేడు పథకంలో పూర్తిగా ఆధునీకరించి, మెరుగైన వసతులు కల్పించారు. దీంతో, షేక్‌ బషీర్‌ పదో తరగతిలో 447 మార్కులు సాధించాడు. తమ కుమారుడికి బంగారు భవిష్యత్తును అందించిన జగన్‌.. దేవుని ఆశీస్సులతో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని వలీబాబా దంపతులు కోరుకుంటున్నారు.

– గోకవరం

మా ఊరిని మార్చింది జగనే.. 1
1/6

మా ఊరిని మార్చింది జగనే..

మా ఊరిని మార్చింది జగనే.. 2
2/6

మా ఊరిని మార్చింది జగనే..

మా ఊరిని మార్చింది జగనే.. 3
3/6

మా ఊరిని మార్చింది జగనే..

మా ఊరిని మార్చింది జగనే.. 4
4/6

మా ఊరిని మార్చింది జగనే..

మా ఊరిని మార్చింది జగనే.. 5
5/6

మా ఊరిని మార్చింది జగనే..

మా ఊరిని మార్చింది జగనే.. 6
6/6

మా ఊరిని మార్చింది జగనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement