
ప్రచారం పీక్
రాజమహేంద్రవరం లాలాచెరువు నగరపాలక సంస్థ పాఠశాలలో ఎంపికై న డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడుతున్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరంలో బస వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు
బారులు తీరిన ఎంపికై న అభ్యర్థులు
సాక్షి, అమలాపురం: పావలా కోడికి ముప్పావలా మషాలా అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ తీరు. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అన్నట్టుగా సాగుతోంది. పుష్కరాలైనా.. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో జనాన్ని తరలించుకువచ్చి మీడియాలో హైప్ సృష్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలో భాగంగానే తాజా డీఎస్సీలో కష్టపడి ఉద్యోగాలు పొందిన వారికి ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈవెంట్గా మార్చేస్తున్నారు చంద్రబాబు. కొత్తగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఇది వ్యయప్రయాసలకు గురి చేస్తోంది.
మెగా డీఎస్సీ–2025 పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ మొదలు.. ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేయడం వరకూ ప్రతి విషయంలోనూ హంగూ ఆర్భాటానికి పెద్దపీట వేస్తోంది. చిన్న పని చేసినా విపరీత ప్రచారం కల్పించుకోవడం సీఎం చంద్రబాబు కోరుకుంటారనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేసిన డీఎస్సీ విషయంలోనూ అదే తీరును కనబరుస్తున్నారు.
ఫోన్లలో సందేశాలు
తొలుత ఈ నెల 19న విజయవాడ వేదికగా నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. వాతావరణం అనుకూలంగా లేదని దానిని వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 25న అమరావతి రావాలంటూ ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అమరావతికి రావాలని విద్యా శాఖ కార్యాలయం నుంచి ఫోన్ సందేశాలు ఎంపికై న అభ్యర్థులకు వస్తున్నాయి. అభ్యర్థితో పాటు ఓ సహాయకుడిని కూడా తీసుకురావాలంటూ ఫోన్లో సమాచారం అందిస్తున్నారు. దీనిపై ఎంపికైన అభ్యర్థులు మండిపడుతున్నారు. వ్యయప్రయాసలకు లోనై అక్కడికి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
3,500 మందికి ఏర్పాట్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,349 మంది టీచర్లు ఎంపికై నట్టు ప్రకటించారు. జోనన్–2 నుంచి టీజీటీ, పీజీటీకి ఎంపికై న194 మంది ఉపాధ్యాయులనూ జిల్లా నుంచే సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 15న డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. నియామకపత్రాల పంపిణీని కూటమి ప్రభుత్వం రా జకీయ ప్రచారంగా మలచుకుంటోంది. ఈ ప్రక్రియ ను రాష్ట్ర స్థాయిలో అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా రావాలని విద్యా శాఖ అధికారులు సందేశాలు పంపారు.
సుదీర్ఘ ప్రయాణం
ఉమ్మడి జిల్లా నుంచి అమరావతి వెళ్లేందుకు అభ్యర్థులు కనీసం 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. వీరిలో మహిళలు, గర్భణులు, చిన్న పిల్లలతో ఉన్నవారున్నారు. వీరంతా ప్రయాసలకోర్చి నియామక ఉత్తర్వులు అందుకోవడానికి వెళ్లాల్సిందే. అలా కాకుండా ప్రతి జిల్లాలో కార్యక్రమం పెట్టి.. నియామక పత్రాలు ఇచ్చి ఉంటే బాగుండేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,543 మంది అభ్యర్థులు, వారితో పాటు మరో 1,543 మంది సహాయకులు వెళ్లాల్సి ఉంది. వీరికి 288 మంది ఉపాధ్యాయులను ఎస్కార్టుగా నియమించారు. పది మంది వైద్య సిబ్బంది, 12 మంది విద్యా శాఖ ఉన్నతాధికారులు కలిపి మొత్తం 3,528 మంది వరకు వెళ్లనున్నారు. మొత్తం 72 బస్సులను ఏర్పాటు చేశారు. డ్యూటీలు పడిన వారికీ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలు కావడంతో లోపల నొచ్చుకుంటూనే బయటకు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లాల్సిన పరిస్థితి. పైగా నేరుగా వెళ్లేందుకు వీల్లేకుండా, అందరినీ బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం రావాల్సిందిగా నిర్దేశించారు. వీరందరికీ స్థానికంగా శ్రీచైతన్య, బీవీఎం ఉన్నత పాఠశాల, లాలాచెరువు మున్సిపల్ హైస్కూల్, సత్యసాయి గురుకులం, సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం (బొమ్మూరు)లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరు గురువారం ఉదయం బయలుదేరి అమరావతి వెళ్లాల్సి ఉంది.
ముందెన్నడూ లేదు
డీఎస్సీ నియామకాల సమయంలో గతంలో ఎప్పుడూ ఈస్థాయి ప్రచారం చేసుకున్న ఘనత మరే ప్రభుత్వానికీ, మరే ముఖ్యమంత్రికీ దక్కలేదు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 2008 మెగా డీఎస్సీ ప్రకటించారు. ఏకంగా 52,655 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఎన్నికలు రావడం, వైఎస్సార్ రెండోసారి సీఎం అయినా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తర్వాత సీఎం అయిన రోశయ్య కాలంలో ఈ పోస్టులు భర్తీ అయ్యాయి. మెరిట్ లిస్టు ప్రకటించడం, తర్వాత రెండు, మూడు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తవడం, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం అంతా కేవలం నాలుగైదు రోజుల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు కేవలం 16,347 పోస్టులు మాత్రమే. కానీ ప్రచారం మాత్రం పీక్ స్టేజ్లో నిర్వహిస్తున్నారు.
నేడు అమరావతిలో
డీఎస్సీ నియామకపత్రాల అందజేత
ఆర్డర్లకు అభ్యర్థులు
250 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..
రాజమహేంద్రవరంలో రాత్రి బస
అక్కడి నుంచి అమరావతికి ప్రయాణం
మండిపడుతున్న
ఎంపికై న ఉపాధ్యాయులు
గతంలో ఎన్నడూ లేని విధానం

ప్రచారం పీక్

ప్రచారం పీక్