గద్వాల క్రైం: మార్క్ఫెడ్ అనుమతి లేకుండా గురువారం ఉదయం రెండు డీసీఎంలలో మొక్కజొన్న సంచులను తరలించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. గద్వాల మండలంలోని కొండపల్లి శివారు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ గిడ్డంగుల గోద్దాం నుంచి మార్క్ఫెడ్ అనుమతి లేకుండా మొక్కజొన్నను తరలిస్తున్నారని లారీ అసోసియేషన్ డ్రైవర్లు గుర్తించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కొన్ని రోజుల నుంచి గోదాం మేనేజర్, సిబ్బంది కలిసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారని స్థానిక డ్రైవర్లు ఆరోపించారు. అధికారులు మాత్రం అనుమతి మేరకు మొక్కజొన్నను గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్నామని చెబుతున్నారు. ఈ విషయమై గద్వాల మార్క్ఫెడ్ అధికారి చంద్రమౌలిని ‘సాక్షి’ వివరణ కోరగా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలోనూ ఇదే గోదాం వద్ద రెండు లారీల యూరియా సైతం చోరీకి గురైనట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.


