ధరూరు: మండలంలోని పెద్ద చింతరేవుల శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. శ్రావణ శనివారం పురస్కరించుకొని ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిష్టాచార్యులు, మద్వాచార్యులు, ఈఓ రాజేశ్వర శర్మ, చైర్మన్ గిరిరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో న్యాయ వాది భీంసేన్రావు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన పశువైద్య సేవలు అందించాలి
గద్వాల వ్యవసాయం: పశువైద్య సిబ్బంది నిత్యం పాడి రైతులకు అందుబాటులో ఉంటూ, పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ వెంకటనారాయణ అన్నారు. శనివారం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో మండల పశువైద్యాధికారులు, ప్యారవేట్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి వ్యాక్సినేషన్, ఫిజికల్ వ్యాక్సినేషన్ పూర్తైన వెంటనే ఆన్లైన్లో అప్డేషన్ చేయాలన్నారు. ప్రతి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వైద్యశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నిబంధనలు అమలు చేయాలన్నారు.
జలసాధన దీక్ష వాల్పోస్టర్ విడుదల
గద్వాల న్యూటౌన్: కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 9న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ల సాధన కోసం జలసాధన దీక్షా దినంగా నిర్వహిద్దామని పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం టీజేఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ వీరభద్రప్ప మాట్లాడుతూ.. కాళోజీ జయంతి రోజున గద్వాల పాత బస్టాండ్ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన కోసం జల సాధన దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఇతర నాయకులతో కలిసి దీక్ష కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ఆలూరి ప్రకాష్గౌడ్, కోఆర్డినేటర్ మధుసూదన్ బాబు, సభ్యులు శంకర ప్రభాకర్, సుభాన్, వాల్మీకి, వినోద్, కోళ్ల హుస్సేన్, భద్రప్ప, పల్లయ్య పాల్గొన్నారు.


