ఎర్రవల్లి: ప్రతి రైతు తప్పనిసరిగా పంటల నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని తిమ్మాపురం, వల్లూరు గ్రామాల్లో వలంటీర్లు నిర్వహిస్తున్న పంటల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగుచేసిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలంటే పంటల నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. లేనిచో పంట విక్రయించే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా వరిసాగు చేసే రైతులు ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్నాలను మాత్రమే పండించాలని సూచించారు. ప్రభుత్వం సన్న రకాలకు ప్రకటించిన రూ.500 బోనస్ పొందేందుకు పంటల నమోదు ఎంతో కీలకమని తెలిపారు. వివిధ పంటలను సాగుచేసిన రైతులు తమ వద్దకు వచ్చే వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వలంటీర్ ద్వారా పంటల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం తిమ్మాపురంలో ధర్తీ మాతా బచావో నిగ్రాణి సమితిపై సమీక్షించారు. ఆయన వెంట ఏఓ సురేశ్గౌడ్, ఏఈఓలు నరేశ్, హసీనా ఉన్నారు.


