సాంకేతిక విద్యకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యకు శ్రీకారం

Aug 31 2026 12:56 AM | Updated on Aug 31 2026 12:56 AM

కోస్గి: పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్‌ బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కళాశాలలు, సైన్స్‌ ల్యాబ్‌ల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఒక్కో కళాశాలకు రూ.25 లక్షలు..

అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దశల వారీగా కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా.. మొదటి విడతలో 19 కళాశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఒక్కో కళాశాలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.4.75 కోట్లు మంజూరు చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్‌ డా. నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఆయా కళాశాలల్లో ప్రత్యేక గదులు నిర్మించి కంప్యూటర్‌ ల్యాబ్‌గా వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సాంకేతిక విద్యపై పట్టుకు..

ప్రభుత్వం చేపట్టిన పలు సర్వేల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని కారణంగా నైపుణ్యాలకు దూరమవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్‌వాలా ద్వారా ఐఐటీ, జేఈఈ, ఖాన్‌ అకాడమీ ద్వారా క్లాట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మరోవైపు గతేడాది ప్లాట్‌ ప్యానల్‌ బోర్డులను సైతం ప్రభుత్వం అందించడంతో కళాశాలల్లో డిజిటల్‌ బోధన జరుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు కంప్యూటర్‌ బోధన అందించి విద్యార్థులు పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలనే లక్ష్యంతో కళాశాలల్లో ప్రత్యేకంగా కంప్యూటర్‌ ల్యాబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కంప్యూటర్‌ ల్యాబ్‌లు ప్రారంభించాలని, త్వరితగతిన నిర్మాణాలు చేసేందుకు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేయాలని అధ్యాపకులతోపాటు విద్యార్థులు కోరుతున్నారు.

జిల్లాల వారీగా ఎంపికై న ప్రభుత్వ కళాశాలలు..

మహబూబ్‌నగర్‌ : జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌, బాలికల జూనియర్‌, జడ్చర్లలోని బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, దేవరకద్ర, బాలానగర్‌, కోయిల్‌కొండ జూనియర్‌ కళాశాలు.

నారాయణపేట : మక్తల్‌, నారాయణపేట జూనియర్‌ కళాశాలలు

నాగర్‌కర్నూల్‌ : కల్వకుర్తి, బిజినేపల్లి,

నాగర్‌కర్నూల్‌ బాలుర కళాశాలలు

వనపర్తి : ఆత్మకూర్‌, వనపర్తి బాలికల

జూనియర్‌ కళాశాల.

జోగుళాంబ గద్వాల : గట్టు, అయిజ, ధరూర్‌, గద్వాల బాలుర, గద్వాల బాలికల కళాశాల.

‘జూనియర్‌’ విద్యార్థులకు కంప్యూటర్‌ బోధన

మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 19 కళాశాలలు ఎంపిక

ల్యాబ్‌ కోసం ప్రత్యేక గది నిర్మాణం.. నిధులు మంజూరు

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు ఆదేశాలు

దశల వారీగా అన్ని కళాశాలల్లో అమలు

పనుల వేగవంతానికి చర్యలు..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మొదటి విడత ఎంపికై న కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కంప్యూటర్‌ ల్యాబ్‌ గదుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. – సుదర్శన్‌రావు,

జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement