మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో వేదపండితులు మంత్రోచ్ఛరణాల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం జరిపించారు. అలాగే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆనవాయితీగా రథోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రం అభివృద్ధికి కృషి
ఆదిశిలా క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డీఈఈ ఓంప్రకాష్, ఈఈ రణవీర్, సంజీవ్ తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచన మేరకు శుక్రవారం ఆదిశిలా క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు వారికి పూలమాల వేసి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటో అందజేశారు.


