ఎక్కడెక్కడ ఎలా అంటే..
65 శాతం పూర్తి..
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య
● భూ సేకరణ పూర్తయితేనే
పెండింగ్ పనులు ముందుకు
● పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై
సీఎం ప్రత్యేక దృష్టి
● అధికారులతో ఆర్అండ్ఆర్
కమిషనర్ వరుస సమీక్షలు
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూ ముల్లో సాగునీటిని పారించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. అసంపూర్తి పనులతో కేవలం 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పెండింగ్ పనులకు నిధుల లేమితో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు జిల్లాల వారీగా ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ.. భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పరిస్థితి ఇలా..
ప్రాజెక్టు సేకరించాల్సిన భూమి ఎస్డీఆర్ నోటిఫికేషన్ డిక్లరేషన్ అవార్డు
నెట్టెంపాడు 389.88 103.55 91.59 75.34 9.90
గట్టు 462.66 – 9.71 – 212.94
తుమ్మిళ్ల 3.44 – – – 3.44
మల్లమ్మకుంట 567.45 – 67.44 – –
నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు.
ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభు త్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకా రం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండ గా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది.
భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి.
జిల్లాలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశాం. సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65శాతం భూమిని సేకరించాం. మల్లమ్మకుంట రిజార్వాయర్కు సంబంధించి రైతులతో ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం ఏర్పాటుచేశాం. కాని రైతుల నుంచి సానుకూలత రాలేదు. మరోసారి సమావేశం ఏర్పాటుచేసి మలమ్మకుంట రిజర్వాయర్కు ఇబ్బందులను తొలగిస్తాం.
– రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్


