అలంపూర్: అధికార యంత్రాంగం కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. బుధవారం అలంపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు 16 నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోవడం దారుణమన్నారు. కార్మికుల నిధులను ఏ పనులకు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఖాతాల్లో పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయకపోవడం వల్ల రుణాల మంజూరు, మరణాంతరం పీఎఫ్ తీసుకునే సమయంలో అధికారులే అనేక కొర్రీలు పెడతారని ఆరోపించారు. కార్మికులకు ప్రతినెలా ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, బెల్లం మాస్క్ లు సైతం పెండింగ్లో ఉంచుతున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ రాజేశ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి గట్టన్న, లక్ష్మీదేవి, నాగశేషమ్మ, రేణుక, లక్ష్మన్న, ఏసేపు, ప్రభుదాసు, మునిస్వామి, వెంకటేశ్, బుచ్చన్న పాల్గొన్నారు.
పెండింగ్ పనులపై నిర్లక్ష్యం తగదు
ధరూరు: సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనుల పూర్తిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి కన్వీనర్ ఆలూరు ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం అఖిలపక్ష నాయకులతో కలిసి ఆయన జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభమై 20 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ ఇంకా పనులు పూర్తి కాలేదన్నారు. తద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడి ఆరేళ్లు గడిచినా నేటికీ మరమ్మతు చేపట్టకపోవడం దారుణమన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి.. త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకుడు శంకర ప్రభాకర్, కోఆర్డినేటర్ మధుసూదన్బాబు, దామోదర్, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
ధర తగ్గని ఉల్లి
దేవరకద్ర: స్థానిక మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఽఉల్లి ధర మరింత పెరిగింది. నాణ్యమైన ఉల్లి ధర గరిష్టంగా రూ.3,300 నుంచి రూ.2,800 వరకు పలికింది. మధ్యరకం ఉల్లి రూ.2,600 నుంచి రూ.2,400, చిన్నసైజు ఉల్లి గరిష్టంగా రూ.2,000 వరకు పలికింది.
చేపల సంరక్షణపై
అవగాహన
అమరచింత (ఆత్మకూర్): చేపపిల్లల పెంపకందారులు సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు షిగా నాగరాజు, బానోత్ దివ్య సూచించారు. బుధవారం ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో ఏటి ఆనంద్ చేపల ఫారంను వారు సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల లక్షణాలు, నివారణ పద్ధతులు, నీటి నాణ్యత నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించారు.


