గద్వాల: జిల్లాలో ఎవరైనా గ్యాస్ సిలండర్లు బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ హెచ్చరించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై ప్రతిరోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఆస్పత్రులు, వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య దుకాణాల నుంచి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందుకోసం పోలీసు శాఖ నిరంతరం విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, సివిల్ సప్లయ్ అధికారి స్వామికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి..
జిల్లా అభివృద్ధి కోసం గత కలెక్టర్ బీఎం సంతోష్ ఎంతో కృషి చేశారని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఇది వరకే బదిలీ అయిన ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ బీఎం సంతోష్కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం చేశారు.


