హైదరాబాద్ ఉద్యోగులకు మినహాయింపు..
ఇన్నాళ్లూ కీలకంగా పనిచేసి..
ఉన్నతాధికారులకు విన్నవించాం..
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 మంది
● ఆందోళనలో కుటుంబాలు
● న్యాయం చేయాలంటూ అధికారులు, పాలకులకు వేడుకోలు
●
తహసీల్దార్ కార్యాలయంలో 2008 నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నాం. మూడు, నాలుగు నెలలకు ఓసారి వేతనం చెల్లిస్తుండగా.. ఎప్పటికై నా కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని భావించాం. కానీ ఏకంగా ఉన్న ఉద్యోగాన్ని తొలగించి బయటకు పంపే ప్రయత్నం చేస్తారని ఊహించలేదు.
– రమేష్, కంప్యూటర్
ఆపరేటర్, వనపర్తి
తహసీల్దార్ కార్యాలయాల్లో కీలకంగా పని చేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పే స్కేల్ అమలు చేసి ప్రతినెలా వేతనం ఇవ్వాలి. ఏళ్లుగా పనిచేస్తున్న మేము ఇప్పుడు బయటకు వచ్చి కొత్తగా ఉద్యోగం వెదుక్కొనే పరిస్థితి కల్పించొద్దు. వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, కుటుంబం మాపై ఆధారపడి జీవిస్తున్న విషయం ప్రభుత్వ పెద్దలు గుర్తించి న్యాయం చేయాలి.
– రఘు, కంప్యూటర్
ఆపరేటర్, ఆత్మకూరు
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో రెవెన్యూశాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో పని చేస్తున్న టీసీసీఓ (టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్)లను శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ప్రస్తుత నడివయస్సులో మరో పని ఎక్కడ చూసుకోవాలనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు కనీసం ప్రత్యామ్నాయం చూపించే దిశగా ఆలోచించకుండా రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్లను నియమించి తమను తొలగించడం ఏమిటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని అమలుచేసే క్రమంలో చోటు చేసుకున్న తప్పిదాలు, అక్రమాలను సైతం ప్రస్తుతం విధులు నిర్వర్తించే టీసీసీఓలకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తాము ధరణి, భూ భారతి వెబ్సైట్లోగాని, రిజిస్ట్రేషన్ విభాగంలోగాని పని చేయలేదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 76 మందికి పైగా..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మార్చి 31న రెన్యూవల్ చేయాల్సిన ఔట్సౌర్సింగ్ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లు 76 మందికి పైగా ఉన్నారు. వీరిలో సుమారు 18 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్నవారు సైతం ఉండటం గమనార్హం. వీరి జీవితం సగం ఇక్కడే గడవగా.. ప్రస్తుతం మరో ఉద్యోగం చూసుకోవాలంటూ బయటకు పంపడం, వారి కుటుంబాలు వీధిన పడుతాయనే ధ్యాస లేకపోవడం శోచనీయం.
వీరితోపాటే 300 హెడ్లో వేతనం పొందుతున్న హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తించే వారిని మినహాయించి మిగతా 32 జిల్లాల్లో పనిచేసే వారిని తొలగించాలని నిర్ణయించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూశాఖ ఉద్యోగ సంఘాల నేతల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం.
నాలుగు సాధారణ ఎన్నికలు, ఎల్ఆర్యూపీ, భూమి (వెబ్ ల్యాండ్), ఐఎల్ఆర్ఎంఎంస్, అకాల వర్షాలు, రెగ్యులర్ సర్టిఫికెట్లు, ఎన్నికల సమయంలో ఫారం–7, 8, 8ఏ తదితర పనులు టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లతో ఆయా మండలాల తహసీల్దార్లు దగ్గరుండి చేయించారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా రెవెన్యూ సదస్సులు, ఇతర పనుల సమయంలో రాత్రింబవళ్లు వీరి సేవలను వినియోగించారు. కానీ ఇటీవల ఎక్కడో ఒకచోట చోటుచేసుకున్న పొరపాట్లను తమకు ఆపాదించి తొలగించే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని అఽధికారులు, పాలకులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు.
ధ్రువపత్రాలు, ప్రొసీడింగ్లు, ఇతర కార్యాలయ పనులు చాలావరకు టీసీసీఓలతోనే చేయిస్తాం. ఏళ్లుగా వారి సేవలు వినియోగిస్తున్నాం. కార్యాలయంలో వారి అవసరం చాలానే ఉంది. తొలగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సైతం నివేదించాం. మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. జిల్లాకేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలకు సరైన సేవలు అందించలేం.
– రమేష్రెడ్డి, తహసీల్దార్, వనపర్తి
హైదరాబాద్ ఉద్యోగులకు మినహాయింపు..
హైదరాబాద్ ఉద్యోగులకు మినహాయింపు..
హైదరాబాద్ ఉద్యోగులకు మినహాయింపు..
హైదరాబాద్ ఉద్యోగులకు మినహాయింపు..


