ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాలన్యూటౌన్: జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి జిల్లా అకాడమిక్ పరీక్షల ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరిటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 8,471 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,366 మంది, ద్వితీయ సంవత్సరం 4,105 మంది ఉన్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్స్ పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు. స్ట్రాంగ్రూంను పోలీస్స్టేషన్లోనే ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో డీఐఈఓ హృదయరాజు, పరీక్షల నిర్వహణ సభ్యులు బండ్ల దేవేందర్రెడ్డి, పద్మావతి, ప్రిన్సిపాల్స్ వీరన్న, కృష్ణ ఉన్నారు.


