మెనూ విధిగా పాటించాలి
ధరూరు: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని డీసీఈబీ సెక్రటరీ ప్రతాప్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంట సరుకులు పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని వంట ఏజెన్సీ మహిళలకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ సాగుతో భూసారం పెరుగుతుంది
ఎర్రవల్లి: రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారాన్ని పెంచడంతో పాటుగా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఏ సక్రియానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సురేష్గౌడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ ప్రకృతి వ్యవసాయం చేయడంతో కలిగే ప్రయోజనాలు, లాభాల గురించి రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ పశువులు, ఆవుల ఆధారంగా జీవామృతం, బీజామృతం వంటి పద్ధతులతో రైతులు క్షేత్రస్థాయిలో పంటలు సాగు చేయవచ్చన్నారు. దీంతో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించవచ్చని సూచించారు. పది కిలోల దేశీ ఆవుపేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల బెల్లం, 200 లీటర్ల నీరు, గుప్పెడు పుట్టమన్ను, రెండుకిలోల పప్పు దినుసుల పొడి మిశ్రమాలను ఒక డ్రమ్ములో పోసి మూడు నుంచి నాలుగు రోజుల పాటు కలియబెట్టుకుంటే జీవామృతం తయారవుతుందన్నారు. తయారు చేసుకున్న జీవామృతాన్ని 15 రోజుల వరకు పంటలపై పిచికారీ చేయవచ్చని సూచించారు. అందుబాటులో లభ్యమయ్యే ఆకులు, అలుములు, అల్లం వెల్లుల్లి, బెల్లం తదితర వాటిని నీటిలో కలుపుకొని బాగా మరిగించుకుంటే కషాయం తయారవుతుందన్నారు. దీనిని పంటలపై పిచికారీ చేసి పురుగులను నియంత్రించవచ్చని చెప్పారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ధాన్యం, కూరగాయాలు, పండ్లకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉందని.. రైతులు తప్పకుండా ప్రకృతి వ్యసాయ పద్ధతులను పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓ నరేష్, సర్పంచ్ కల్పన శంకర్నాయుడు, వసంత్కుమార్రెడ్డి, రవీంద్రమ్మ, అనూష, రామకృష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల అథ్లెటిక్స్లో విద్యార్థి ప్రతిభ
మానవపాడు: మండలంలోని జల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 6వ తరగతి విద్యార్థి పవన్కుమార్ హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల అథ్లెటిక్స్లో చక్కటి ప్రతిభ కనబర్చారు. అండర్–14 పరుగు పందెం విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడని పేర్కొన్నారు.
అద్దె ప్రాతిపదికనఆర్టీసీ బస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: రానున్న పెళ్లిళ్లు, శుభాకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు రీజినల్ మేనేజర్ సంతో ష్కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రీజియన్లోని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే తక్కువ ధర ఉంటుందని, డ్రైవర్ బత్తా కట్టనవసరం లేదని, సౌకర్యవంతమైన బీఎస్6 అధునాతన టెక్నాలజీ కొత్త బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులను బుకింగ్ చేసుకునేందుకు గద్వాల 99592 26290 నంబర్ను సంప్రదించాలని కోరారు.
మెనూ విధిగా పాటించాలి


