భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ వడ్లను పారదర్శకంగా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యాలకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రోజువారీ వడ్ల కొనుగోలు, ఎగుమతులపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్ కుమార్ ఉన్నారు.


