వెంకటాపురం(కె): ఏజెన్సీలో డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు రవి కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు శుక్రవారం బైటాయించారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో నది పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పేరుతో డిసిల్టింగ్ విధానం ప్రవేశపెట్టి ప్రభుత్వం సర్వే చేపట్టిందని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లేవని కోర్టు నిలుపుదల చేసినా ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ మండలాల్లో అధికారులు సర్వే చేయటం విడ్డూరంగా ఉందన్నారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే పార్టీలు, ప్రజా సంఘాలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, నాయకులు రత్నం రాజేందర్, దావూద్, చిట్టిబాబు, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, చిట్టెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రవికుమార్


