కాళేశ్వరం: రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాడి బాబురావు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం బొమ్మపూర్ రైతువేదికలో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్తో కలిసి విత్తనాల డీలర్లు, రైతులకు డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు ఎంపిక చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేబుల్ చూసి విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పారు. ఏడీఏ శ్రీపాల్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా ఆ సీడ్ ప్యాకెట్ బిల్లు సీజన్ అయిపోయేంత వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని చెప్పారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని సూచించారు. వరి కొయ్యలను కాల్చకుండా పర్యావరణాన్ని రక్షించాలని చెప్పారు.


