మల్హర్: మండలంలోని అన్సాన్పల్లి–భూపాలపల్లి మండలంలోని కాసీంపల్లి శివారులోని అంతర్గత రోడ్డు ప్రమాదకరంగా ఉంది. దీంతో వాహనదారులు భయంభయంగా ప్రయాణం చేస్తూ రోడ్డును దాటితే చాలు అనే పరిస్థితి నెలకొంది. 2023 జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామల మధ్యగల బీటీ ఒక చోటు పూర్తిగా కొట్టుకపోయింది. వరద నీరు ప్రవహించడంతో అలాగే మరి కొన్ని చోట్ల బీటీ కింద ఉన్న మట్టి కొట్టుక పోయి రోడ్డు ప్రమాదకరంగా మారింది.
మరమ్మతులు లేవు..
ఈ రోడ్డు గుండా మండలంలోని అన్సాపల్లి గ్రామస్తులు భూపాలపల్లి జంగేడు, కాసీంపల్లి గ్రామం మీదుగా భూపాలపల్లికి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. రైతులు గ్రామ శివారులోని తమ పొలాలకు వ్యవసాయ పనులకు సైతం వెళ్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదకరంగా మారి రెండు సంవత్సరం గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వర్షకాలం సీజన్లో ఇబ్బందులు మరింత ఎక్కువ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
భయాందోళనలో వాహనదారులు
పట్టించుకోని అధికారులు


