● తడిసిన ధాన్యం
● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
చిట్యాల/రేగొండ/టేకుమట్ల: జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాల్లో వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఓ రైతుకు చెందిన వరిధాన్యం తడిసిపోయింది. చిట్యాల మండల కేంద్రంతో పాటు గుంటూరుపల్లి, నైన్పాక, తిరుమాలాపూర్ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు చెట్లు రోడ్లపై కూలిపోయాయి. హైస్కూల్లో ప్రహరీపై భారీ వృక్షం కూలింది. పోలీస్స్టేషన్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి పోయి భవనాలపై పడ్డాయి. ఏఆర్పల్లిలో కుమారస్వామికి చెందిన ఇల్లు వెనుకభాగం కూలిపోయింది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గుండా స్వామి ఇంటి రేకులు గాలికి లేచిపోయాయి. చిట్యాల సివిల్ ఆస్పత్రి నేమ్ బోర్డు పడిపోయింది. రేగొండ మండలం లింగాల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొడవటంచలోని కోడెపాక రాజయ్య ఇంటి ముందు చెట్టు విరిగిపడింది. గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె నారాయణ, గుండె రవి ఇంటిపై చెట్టు విరిగి పడడంతో రేకులతో పాటు గోడలు ధ్వంసమయ్యాయి. టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన బిల్లకంటి కోటేశ్వర్రావు ఇంటిరేకులు ఎగిరి పడ్డాయి.
చిట్యాల: పాఠశాలలో కూలిపోయిన భారీ వృక్షం
రేగొండ: ధ్వంసమైన రేకుల ఇల్లు
చిట్యాల: మార్కెట్లో తడిసిన ధాన్యం
టేకుమట్ల: కిందపడ్డ ఇంటిపైకప్పు


