రేగొండ: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఫిర్యాదుదారు, అతడి మిత్రులపై వాట్సాప్ గ్రూపులో గుర్రాల సుమన్ రెడ్డి అనే వ్యక్తి అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించగా కొలెపాక భిక్షపతి సూచన మేరకు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపాడు. సోషల్ మీడియాలో శాంతిభద్రతాలకు విఘాతం కలిగించే విధంగా పోస్ట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
సన్మానం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్ణణ కేంద్రంలోని ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నికై న నాగపూరి సమ్మయ్యను మంగళవారం పట్టణ కేంద్రంలో ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉప అధ్యక్షులు బేతిల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
పరామర్శ
చిట్యాల: మండల కేంద్రానికి చెందిన గంగాధరి రాజు కొంత కాలంగా కేన్సర్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి రాజును పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
ఉపాధి కూలీలకు
మజ్జిగ పంపిణీ
భూపాలపల్లి రూరల్: మండలంలోని గుర్రంపేట గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్ కోడూరి రమేశ్ మంగళవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, ఉప సర్పంచ్ దామెరుప్పల సుధాకర్, వార్డ్ మెంబర్ దామెరుప్పల సుమలత, ఇతర వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
కాటారంలో..
మల్హర్(కాటారం): కాటారం మండలంలోని గుండ్రాత్ పల్లి 8వ వార్డు సభ్యుడు జనగాం రవీనా సురేష్ కుమారుడు నిహాన్స్ జన్మదినం పురస్కరించుకొని గుండ్రాత్ పల్లి, గంగాపురి, మల్లారం గ్రామాల్లో పని చేస్తున్న ఉపాధికూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ సెలవోజు తిరుపతి, మాజీ సర్పంచ్ ప్రవళిక ప్రభాకర్, శంకరయ్య, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
వారాంతపు సంత వెలవెల
వెంకటాపురం(కె): రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా మండల కేంద్రంలో వారాంతపు సంత వెలవెలపోయింది. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో ప్రతీ వారం సంత నిర్వహణకు అధిక సంఖ్యలో జనం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వచ్చేవారు. నేటి వారాంతపు సంతకు వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు లేక వ్యాపారాలు జరగలేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. మండలకేంద్రంలో 46 డిగ్రీల ఎండ నమోదు కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.


