భూపాలపల్లి అర్బన్: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వెళ్లే భక్తులు భూపాలపల్లి బస్టాండ్లో ఆదివారం ఇబ్బందులు పడ్డారు. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి బస్టాండ్లోనే వేచి ఉన్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు అసౌకర్యానికి గురయ్యారు. పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ భూపాలపల్లి బస్టాండ్ వద్ద మాత్రం అవసరానికి తగ్గట్టుగా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.


