● సేంద్రియ కర్బన శాతం పెరిగి
దిగుబడులు పెరిగే అవకాశముంది.
● ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవడంతో ఎరువుల వాడకం తగ్గుతుంది.
● మొక్కలకు 2 శాతం నత్రజని
(యూరియా), 4 శాతం ఫాస్పరస్
అదనంగా అందుతుంది.
● నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
మొగుళ్లపల్లి: గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. పశువులు ఎక్కువగా ఉండడంతో గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వ చేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. మిషన్ హార్వెస్టింగ్ చేసే సమయంలో వరిపైరును పైకి కోయడంతో కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొంత గడ్డిని కోసి తీసుకొచ్చుకుని మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతో పాటు గడ్డిని కూడా కాల్చివేస్తున్నారు.
కోల్పోతున్న భూసారం
వరి కొయ్యలను కల్చడంతో అధిక నష్టాలు వచ్చే అవకాశముందని, వరికొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ వంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగుబడి తక్కువగా వస్తుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు, వానపాములు, జీవరాసులు చనిపోతాయి. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని అధికారులు తెలుపుతున్నారు.
కలియ దున్నితే ఎరువుగా తయారీ..
అవగాహన కల్పిస్తున్న అధికారులు


