● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్
భూపాలపల్లి అర్బన్: రాజయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన కంపేటి రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. రాజయ్య జీవితం అసలైన కమ్యూనిస్టు ఉద్యమానికి నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలు తరతరాలకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు. అనంతరం రాజయ్య పేరుతో పర్మినెంట్ కార్మికుల కోసం ఒక కార్యాలయం, కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరో కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో రాజయ్య స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మాణానికి కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య కుటుంబ సభ్యులు లక్ష్మి, నాగరాజు, స్వాతి, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రాజయ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


