భూపాలపల్లి అర్బన్: భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని భూపాలపల్లి, ములుగు జిల్లాల ఆహార తనిఖీ అధికారులు వరుణ్రెడ్డి, ధర్మేంద్ర అన్నారు. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లలో ఆహార భద్రత ప్రమాణాలపై వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాల్ నిర్వాహకులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం, భద్రతా ప్రమాణాలపై సూచనలు చేశారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందించడం స్టాల్ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, వడ్డనలో పాటించాల్సిన నిబంధనలు, చేతుల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి వినియోగం తదితర అంశాలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. అలాగే కిరాణం షాపుల్లో కుల్డ్రింక్ బాటిళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శాంపిల్స్ సేకరణ సిబ్బంది నరేష్, ల్యాబ్ టెక్నీషియన్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.


