భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, పిక కిరణ్, కాసర్ల ప్రసాద్రెడ్డి, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, ఐత్య బాబు, రాళ్లబండి బాబు, జయశంకర్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.


