భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మెడికల్ కళాశాలలో షీ టీం– భరోసా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, లింగ సమానత్వం, బాలల రక్షణ, మహిళలపై వివక్ష, హింసాత్మక చర్యలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 1930, 1098 నంబర్లను సంప్రదించాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు భూపాలపల్లి షీ టీంను 87126 58162 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని షీ టీం ఎస్ఐ మహ్మద్ ఫజల్ ఖాన్, భరోసా ఎస్ఐ స్వప్న కుమారి సూచించారు.
మే డేను
విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన మే డేను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ వరంగల్, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు రాజేందర్, రాయిశెట్టి సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడుల రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినం మేడే వీరుల త్యాగ ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింగం, నవీన్, సమ్మయ్య పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్మన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ దేవుల పల్లి విజయ్కుమార్, వంగపండ్ల రవి పాల్గొన్నారు.


