ములుగు రూరల్: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సంబురాలు జరుపుకోవడం దారుణమన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా డిలీమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించి బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, సుమలత, జాడి వెంకట్, నరేశ్ పాల్గొన్నారు.


