భూపాలపల్లి: ప్రతీ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరుపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. విచారణలో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, మిస్సింగ్ కేసుల వివరాలను సమగ్రంగా సమీక్షించారు. లైంగిక దాడి, పోక్సో కేసులను నిర్ణీత గడువుల్లో పూర్తిచేసి నిందితులను కోర్టు ముందు నిలపాలని జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ నిత్యం వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


