భూపాలపల్లి రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి విద్యార్థులకు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి యంత్రము పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. టేకుమట్ల మండలం నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని దామరంచపల్లి శివారులో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమాని మోరె నరేష్, డ్రైవర్ కొమ్ము కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పలకీ సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉద యం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. శ్రీవిద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు.
రిటైర్డ్ ఉద్యోగుల
బెనిఫిట్స్ చెల్లించాలి
విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు.


