భూపాలపల్లి అర్బన్: పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో భూమిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా సైన్స్ అధికారి స్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ‘మన భూమిని కాపాడుకుందాం–పర్యావరణాన్ని రక్షిద్దాం’ అనే నినాదంతో పాఠశాల ప్రాంగణంలో కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్సు అధికారి స్వామి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి జూట్, కాటన్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. తక్కువ దూరాలకు వాహనాల బదులు సైకిళ్లను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా సైన్స్ అధికారి స్వామి


