మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈ నెల 20న జరిగే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శాసనసభ్యులందరూ పాల్గొంటారని చెప్పారు. రైతులు, మహిళలు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయంవతం చేయాలని కోరారు.
బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ వేదిక ఏర్పాట్లు, ప్రాంగణ అభివృద్ధి, లైటింగ్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీఓ వీరస్వామి, విద్యుత్ డీఈ నాగరాజు పాల్గొన్నారు.
లైటింగ్ ఏర్పాట్ల పరిశీలన
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి అధికారులను ఆదేశించారు. నస్తూరిపల్లి లైటింగ్ ఏర్పాట్లు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ నాగరాజు, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు


