● జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా సంక్షేమ అభివృద్ధి అధికారి ప్రేమలత అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కులను పరిరక్షించేందుకు సంబంధిత చట్టాలపై సోమవారం అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రైతులు, భవన నిర్మాణ కార్మిక యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ), చైల్డ్హెల్ప్లైన్ (సీహెచ్ఎల్), ఉమెన్ హబ్ సంయుక్తంగా ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణకు కలెక్టర్ దివాకర ఆదేశాల ప్రకారం మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య సిబ్బంది వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. రైతులకు నోటీసులు జారీ చేశారు. 14 నుంచి 18ఏళ్ల బాలలను పనుల్లో పెట్టుకోవద్దని తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా సుమారు వంద మంది రైతులకు నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించినట్లు వివరించారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బాలలు తప్పకుండా విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ అబ్బనబోయిన నరేశ్, సూపర్వైజర్ సుదర్శన్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు సంజీవ, జ్యోతి, మహిళా శక్తి సాధికారిత జిల్లా అధికారి రమాదేవి పాల్గొన్నారు.


