భూపాలపల్లి అర్బన్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మూడంచెల పోరాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.


