భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఎంఓఏఐ భూపాలపల్లి అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్ మాట్లాడుతూ..కోలిండియా లిమిటెడ్లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు ప్రకటించిన ఇతర భత్యాలను అధికారులకు కూడా అమలు చేయాలని, వివిధ పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. చార్జ్షీట్ విచారణలను పారదర్శకంగా నిర్వహించి త్వరితగతిన ముగించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ఏరియా కార్యదర్శి అరుణ్, జాయింట్ ట్రెజరర్ సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీ మన్నాన్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, అధికారులు శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్, జ్యోతి పాల్గొన్నారు.


