మల్లన్న బోనాలు
మల్లన్న పట్నాలు వేస్తున్న భక్తులు
మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని గోదావరి ఒడ్డున వెలిసిన మల్లన్న దేవుడి ఆలయంలో ఆదివారం మల్లన్న పట్నాలు, బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులతో పట్నాలు నిర్వహించి మల్లన్న దేవుడికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య శివశక్తుల పూనకాలతో భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
– కాళేశ్వరం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే ఆరు కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దకాలంగా ఇసుల రీచుల గుండా తరలివచ్చిన లారీలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రహదారిని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రూ.22 కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో రాత్రి ఆపదొస్తే కనీసం 108 అంబులెన్స్ వెళ్లలేని దుస్థితిలో ఈ రహదారి ఉంది.
కీలక రవాణా మార్గం..
పలుగుల రహదారి పలుగుల టు కుంట్లం గ్రామాల ప్రజలకు కీలక రవాణా మార్గంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా ఇసుక రీచ్ల నుంచి వచ్చే భారీ లారీల రాకపోకలతో రహదారి ఆనవాళ్లు కోల్పోయి పూర్తిగా చెడిపోయింది. మోకాలు లోతు గుంతలు, దుమ్ము కారణంగా వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రయాణం చేయడం కూడా కష్టంగా మారేది. రహదారి నిర్మాణం పూర్తయితే పలుగుల, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు రవాణా మెరుగుపడి కాళేశ్వరం పాఠశాలకు రానున్నారు. కొత్త రహదారి నిర్మాణంతో ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూ.22 కోట్లతో మంత్రి శంకుస్థాపన
పదేళ్ల నరకయాతనకు చెక్
ఇసుక రీచుల లారీలతో
ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు


