మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. కలెక్టర్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి అర్చనలు జరిపించి స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలను బహుకరించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


