న్యూస్రీల్
నిర్లక్ష్యం ఎందుకో..?
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
రూ.3.40 కోట్ల నిధులతో ఏర్పాటు
● టెక్నీషియన్లు, సిబ్బందిని
నియమించడంలో నిర్లక్ష్యం
● ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ
ఆర్థికంగా నష్టపోతున్న రోగులు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం నిరుపయోగంగా మారింది. రూ.3.40 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈసీఐఎల్ సంస్థ యంత్రాన్ని ఏర్పాటుచేసినా టెక్నీషియన్లు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో పేద రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
గతేడాది ప్రారంభమైనా..
గతేడాది నవంబర్ 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అస్పత్రిలో సీటీ స్కానింగ్ యంత్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రోడ్డు ప్ర మాద బాధితులు, తలకు, మెదడు, గుండె సంబంధిత సమస్యలు, అంతర్గత గాయాలు తదితర రోగులకు ప్రయోజనం కలుగుతుందని అనుకున్నారు. కానీ ప్రారంభించి నాలుగు నెలలు అవుతున్నా రేడియాలజీ, సీటీ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫిసర్లను నియమించలేదు. దీంతో సీటీస్కాన్ సేవలు రోగులకు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులను పరీక్షిస్తున్న వైద్యులు సీటీస్కాన్ అవసరం ఉంటే వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేస్తున్నారు. లేదంటే ప్రైవేట్లో డబ్బులు పెట్టి సేవలు పొందాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
టెక్నీషియన్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా సీటీ స్కానింగ్ యంత్రం నిర్వహణపై ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టిసారించడం లేదు. కావాల్సిన సిబ్బంది నియామకంపై సంబంధింత అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు కనిపిస్తుంది.
యంత్రాన్ని ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని జిల్లా ప్రజలు అంటున్నారు. రెండు నెలల క్రితమే టెక్నీషియన్ నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థుల ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని కలెక్టర్ తిరస్కరించినట్లు తెలిసింది. ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనం మూలంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


