భూపాలపల్లి: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా ముందుకుసాగుతూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, రాణి లక్ష్మీబాయి వంటి మహనీయ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలు విద్య, ఉపాధి, పరిపాలన, క్రీడలు తదితర రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, భూపాలపల్లి సీఐ డి.నరేష్కుమార్, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు
దూరంగా ఉండాలి
యువత గంజాయి, మాదకద్రవ్యాలు లాంటి ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడా రంగాల్లో రాణించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన టీంలకు జిల్లా పోలీసు కార్యాలయంలో బహుమతులు అందజేశారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ అతిథిగా కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


