గణపురం : మండలకేంద్రానికి చెందిన తాళ్లపెల్లి నందకిషోర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ 2025 అవార్డులలో ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన కుబేర సినిమాలో నంద కిషోర్ రెండు పాటలు రాయగా అందులో ఆకలితో నువ్వు పస్తుంటే అనే పాటకు ఆయనను ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నందకిషోర్ను పలువురు అభినందిస్తున్నారు.
విద్యుత్ సమస్య రాకుండా చూడాలి
చిట్యాల: వినియోగదారులకు ఎండాకాలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సుందర్కుమార్ విద్యుత్ సిబ్బందికి తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా అధిక లోడు ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానిని గుర్తించి కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్లు వెంకటేశ్ , రమేశ్, ఎస్కే అక్బర్, ఎస్ఎల్ఐ కుమార్స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ సతీష్, ఏఎల్ఎం, సిబ్బంది పాల్గొన్నారు.
మంజూరు పత్రాల
అందజేత
హన్మకొండ కల్చరల్: వరంగల్జోన్ పరిధి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరస్వామి దేవాలయంలో పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ పవన్కుమార్, ప్రధానార్చకుడు క్రిష్ణమూర్తిలకు అర్చక సంక్షేమ నిధినుంచి రూ.8లక్షలు మంజూరయ్యాయి. ఆ మంజూరు పత్రాలను శనివారం హనుమకొండలోని రాంనగర్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వారికి అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జోన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామల సునీత పాల్గొన్నారు.


