భూపాలపల్లి అర్బన్: ఇన్సర్వీస్ అభ్యర్థుల నుంచి ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జుమ్లానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వృత్తిలో కనీసం మూడు సంవత్సరాల అనుభవంతో పరిశ్రమలలో పనిచేస్తూ జీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిగి ఉన్న ఇన్ సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తు ఫారాలు అందించనున్నట్లు తెలిపారు.
ఉపసర్పంచ్ల
జిల్లా కమిటీ ఎన్నిక
భూపాలపల్లి రూరల్: జిల్లా ఉప సర్పంచ్ల కమిటీని ఎన్నుకున్నట్లు ఆ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ తెలిపారు. జిల్లాకేంద్రంలో రైస్మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గట్టు ప్రదీప్ గౌడ్, (గోరి కొత్తపల్లి), జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బొబ్బిలి రాజు (కొయ్యుర్), జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శంకర్ (రేగొండ)తో పాటు తదితరులను ఎన్నుకున్నారు.
రమేశ్కు జాతీయ సేవారత్న అవార్డు
భూపాలపల్లి అర్బన్: స్థానిక న్యాయవాది భూక్యా రమేశ్నాయక్ను జాతీయ సేవా రత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రమేశ్నాయక్ న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తూనే సేవా కార్యక్రమాల్లో చేసిన విశిష్ట కృషికి సేవా రత్న నేషనల్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
అటవీశాఖ కార్యాలయంలో వేడుకలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కాళేశ్వరం సర్కిల్ మినిస్టీరియల్ ఫోరం అధ్యక్షుడు సలీం రాజిమీర్జా, కోశాధికారి మధుప్రసన్న ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏఓ కొమురయ్య, సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు.
పనులు పూర్తి చేయండి
వాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తిచేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి ఉన్నారు.


