చంద్రగ్రహణం సందర్భంగా
ద్వారబంధనం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, ఉప ఆలయాలను కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు ద్వార బంధనం చేశారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ మహేష్ తెలిపారు. చంద్రగ్రహణం ఎఫెక్ట్తో కాళేశ్వరంలో భక్తులు లేకపోవడంతో గోదావరి తీరం, ఆలయం, ప్రధాన వీధులు బోసిపోయాయి. చంద్రగ్రహణం విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశకు గురై వెనుదిరిగారు.
మల్హర్(కాటారం): అడవులు, వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాటారం ఫారెస్ట్ రేంజ్ అధికారి జాడి స్వాతి అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం రేంజర్ స్వాతి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది కాటారం సెంటర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడవుల్లో ఉండే జంతువులను రక్షించుకోవాలని సూచించారు. అడవులను మరింత పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడించారు. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారితో పాటు అటవీ పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు వేయరాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్లు జి.సురేందర్, శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ అర్చన, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: 33/11 కేవీ జంగేడు సబ్ స్టేషన్లో 11 కేవీ లైన్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నందున నేడు (బుధవారం) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని భూపాలపల్లి పట్టణ విద్యుత్శాఖ ఏఈ విశ్వాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు, ఫకీర్ గడ్డ, ఆకుదారివాడ, కాకతీయకాలని, వేశాలపల్లి, భాస్కర్గడ్డ, డబుల్ బెడ్రూం, పెద్దకుంటపల్లి, మల్లంపల్లి, కమలాపూర్ గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
పోస్టాఫీస్ ద్వారా
రాములవారి తలంబ్రాలు
భూపాలపల్లి అర్బన్: శ్రీ రామనవమి సందర్భంగా ఈనెల 27న భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర ‘కల్యాణ తలంబ్రాలు’ పోస్టాఫీస్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు సమీప పోస్టాఫీస్లో రుసుం చెల్లించి తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలు (1 ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు) రూ.450, ముత్యాల తలంబ్రాలు (1 ముత్యం) రూ. 151 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు పంపించనున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.


