కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం పదహారు రోజుల పండుగను శ్రీశుభానంద ముక్తీశ్వరుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రికి ఉత్సవమూర్తుల కల్యాణం జరిగి సోమవారానికి 16 రోజులు కావడంతో ఉదయం 10.30 గంటలకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో కల్యాణం కార్యక్రమాన్ని పూజాకార్యక్రమాలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
ఆర్చరీలో గోల్డ్మెడల్
మల్హర్(కాటారం): ఆర్చరీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో కాటారం ఎర్రగుంటల్లికి చెందిన రామిళ్ల అనయ గోల్డ్మెడల్ సాధించింది. ఈ నెల 8న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో పొల్గొనేందుకు అర్హత సాధించిందని కరీంనగర్ ఆర్చరీ జనరల్ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్, కోచ్ నగేష్ తెలిపారు.
కేన్సర్తో అంగన్వాడీ టీచర్ మృతి
టేకుమట్ల: మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బోయిని ఝాన్సీ(45) సోమవారం మృతి చెందింది. కొంతకాలంగా కేన్సర్ బారిన పడి చికిత్స పొందగా.. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భర్త సైతం ఐదు సంవత్సరాల క్రితం కేన్సర్ బారిన పడి మృతిచెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా తల్లిదండ్రుల మృతితో అనాథలైన కూతుర్లను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. పెద్దకూతురు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రాస్తుండగా.. చిన్న కూతురు 9వ తరగతి చదువుతోంది.
సెంట్రల్ డ్రగ్ స్టోర్
రికార్డుల పరిశీలన
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజిలెన్స్ డ్రగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ స్టోర్, మెడికల్ కళాశాల సెంట్రల్ స్టోర్ను విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన 50 ఇంజక్షన్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వం నుంచి పునిస్కా కంపెనీకి చెందిన 0217 బ్యాచ్ నంబర్ కలిగిన 1,700 మెట్రోనైడోజనల్ ఇంజక్షన్లు సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు సరఫరా కాగా ములుగు ఆస్పత్రికి 1,286 ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని తెలిపారు. మిగిలిన 414 నిల్వ ఉన్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన మందులను ఇష్టానుసారంగా నిల్వ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.


