భూపాలపల్లి అర్బన్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 65 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ హరి కృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేసిన నాయకుడు
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు అంకితభావంతో పనిచేశారని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. 89వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత, నైతిక విలువలు ప్రతీ ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్శర్మ


